బీసీల హక్కుల కోసం ఐక్య పోరాటమే మార్గం ఈటల రాజేందర్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు)
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఆధ్వర్యంలో బీసీలకు బడ్జెట్లో జరుగుతున్న అన్యాయంపై నిర్వహించిన నిరాహార దీక్షలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ మధుసూదన చారి, బాలరాజు గౌడ్, దుర్గయ్య, వెంకన్న, ఎలికట్టే విజయ్, బైరి శేఖర్, నారాయణ గౌడ్, అబ్బాస్, రమణ, శ్రీకాంత్, లింగేష్ యాదవ్, లలిత, మల్లిఖార్జున్ తదితరులు హాజరయ్యారు.తెలంగాణలో ఒకప్పుడు సామాజిక చైతన్యం ఉప్పొంగేదని, ఇప్పుడు అదే సమాజం నిర్వీర్యం అవుతుండటం ఆందోళనకరమని ఈటల రాజేందర్ అన్నారు. “చట్టం కూడా ఉన్నవాడి చుట్టంలా మారింది. పేదవాడికి న్యాయం మీద నమ్మకం పోయింది. ఇది సమాజానికి మంచిది కాదు” అని వ్యాఖ్యానించారు. బీసీలలో ఐక్యత పెరగాలని, “నీ రాజ్యం నువ్వు ఏలుకో” అనే నినాదం కార్యరూపం దాల్చాలని పిలుపునిచ్చారు.బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో డబ్బులున్నవారికే టికెట్లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. “బడ్జెట్ కేటాయించామని చెప్పి ఐదు పైసలు కూడా ఖర్చు చేయకపోవడం మోసం” అని ఆరోపించారు.“రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాడికే ఊడిగం చేస్తుంది” అని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సంపద ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అయితే ఆ దిశగా అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చివేత, గాజులరామారంలో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. పేదలపై బుల్డోజర్లు నడిపించడం అన్యాయమని, పెద్దల భూకబ్జాలపై మాత్రం చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. ఎల్లమ్మబండ భూముల వ్యవహారంలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిందని ఆరోపిస్తూ, ఆ నిధులతో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తీర్చవచ్చని అన్నారు.ప్రభుత్వం పేదల కోసమే ఉండాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
బీసీల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, సామాజిక న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


Comments