విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ
ఏ ఎస్ రావు నగర్, ఫిబ్రవరి 27 ( తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో కమలానగర్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95వ వర్ధంతి సందర్భంగా కమలానగర్ కార్యాలయంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, స్ఫూర్తి గ్రూప్ నాయకులు బంగారు నర్సింగ్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సభ్యులందరూ పుష్పాంజలి ఘటించారు.
అధ్యక్షుడు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ధీరుడు చంద్రశేఖర్ ఆజాద్ అని కొనియాడారు. 15 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు కొరడా దెబ్బల శిక్షను అనుభవించారని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహా విప్లవకారుడని పేర్కొన్నారు.
స్ఫూర్తి గ్రూప్ నాయకుడు బంగారు నర్సింగ్రావు మాట్లాడుతూ, తాను రచించిన చంద్రశేఖర్ ఆజాద్పై వ్యాసం “ధరణి” పత్రికలో ప్రచురితమైందని తెలిపారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలను సభికులకు చదివి వినిపించారు.సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ, ఆజాద్ పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బంగారు నర్సింగ్రావు, అశోక్, ఎన్. శ్రీనివాస్, జి. శ్రీనివాసులు, ఎం. శ్రీనివాసరావు, గౌసియా, వెంకన్న, లక్ష్మయ్య, గణేష్, రాజశేఖర్, లింగస్వామి, సత్యనారాయణ, ఉన్నికృష్ణన్, రవి, శివరామకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Comments