చికిత్స పొందుతూ ప్రమీల రాణి మృతి
శారదా బస్ స్టాప్ జంక్షన్ వద్ద కారు ఢీకొనడంతో దుర్ఘటన
కుషాయిగూడ, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు)
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది.పోలీసుల వివరాల ప్రకారం, మణికొండ జాగీర్ ప్రాంతానికి చెందిన బద్దురు బ్రహ్మా రెడ్డి (70) ఫిబ్రవరి 26 ఉదయం కుషాయిగూడ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, ఫిబ్రవరి 25 రాత్రి సుమారు 11:55 గంటల సమయంలో ఆయన వియ్యంకులు అవుల వెంకట్ రెడ్డి మరియు ఆయన భార్య ఎ. ప్రమీల రాణి మోటార్ సైకిల్పై నేరేడ్మెట్ వైపు నుండి ఏఎస్ రావు నగర్ వైపు వస్తుండగా శారదా బస్ స్టాప్ జంక్షన్ వద్ద (రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా) ఒక కారు ఢీకొట్టింది.ప్రమాదంలో ప్రమీల రాణి అపస్మారక స్థితికి చేరుకోగా, ఆమెను ఈసీఐఎల్లోని శ్రీకర హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అవుల వెంకట్ రెడ్డికి ఎడమ కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కారు నడిపిన వ్యక్తిని దొడ్డల తరుణ్ (31), నివాసం సాయినాథ్పురం, నేరేడ్మెట్గా గుర్తించారు.ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 27 సాయంత్రం సుమారు 4:12 గంటలకు చికిత్స పొందుతుండగా ప్రమీల రాణి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.


Comments