రాష్ట్రపతి నిలయంలో జాతీయ సైన్స్ డే వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు)
జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం కార్యనిర్వాహణ అధికారి డాక్టర్ రజినీప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ సైంటిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రమౌళి, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బి.సి. పరిదా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.రెండు రోజులపాటు కొనసాగనున్న విజ్ఞాన ఆవిష్కరణ ప్రదర్శనలను అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రఖ్యాత శాస్త్రీయ సంస్థలు తమ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేశాయి.ప్రదర్శనల్లో పాల్గొన్న *సంస్థలు*:డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మరియు డయాగ్నస్టిక్స్ కేంద్రం,నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, సిఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ,
సర్వే ఆఫ్ ఇండియా,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్,నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.అలాగే నగరంలోని సుమారు 38 విద్యాసంస్థల నుంచి దాదాపు నాలుగువేల మంది విద్యార్థులు పాల్గొని శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు సంబంధించిన వినూత్న మోడళ్లతో స్టాల్స్ ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో భాగంగా క్విజ్, సైన్స్ మోడల్ ఎగ్జిబిషన్, పోస్టర్ మేకింగ్ వంటి పోటీలు నిర్వహించారు.విద్యార్థుల్లో శాస్త్రంపై ఆసక్తి పెంపొందించేందుకు, పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించేందుకు ఈ వేడుకలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.


Comments