రాజ్యసభలో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలి
ఎమ్మార్పీఎస్ డిమాండ్
వనపర్తి,మార్చి2(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో ఈ నెల మొదటి వారంలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటిని మాదిగ సమాజానికి కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దమందడి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సోమవారం ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ మేరకు తీర్మానం చేశారు.ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు సింగిరెడ్డి మహేష్ మాదిగ అధ్యక్షత వహించారు. ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీ అవబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక సీటు కేటాయించాలని కోరారు.తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్ లోకసభ స్థానాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటికీ మాదిగలకు అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మాదిగ సమాజానికి లోకసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు.రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సింగిల్ కాస్ట్గా మాదిగలు ఉన్నప్పటికీ, వారికి తగిన గుర్తింపు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని విమర్శించారు.ప్రస్తుతం రాజ్యసభలోనైనా మాదిగలకు అవకాశం కల్పించాలని, లేకపోతే మాదిగ సమాజ ఆవేదనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఇప్పటికే లోకసభలో ఏడుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన సభ్యులు ఉన్నారని, రాబోయే రాజ్యసభ ఎన్నికల్లోనూ అదే వర్గానికి ప్రాధాన్యం ఇస్తే అది అన్యాయమవుతుందని పేర్కొన్నారు. ఖాళీ అయ్యే రెండు స్థానాల్లో ఒకటిని మాదిగలకు కేటాయిస్తే, రెండో స్థానాన్ని ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కొమ్ము శ్రీనివాసులు మాదిగ, కొమ్ము సత్యనారాయణ మాదిగ, సింగిరెడ్డి వెంకటస్వామి, హనుమంతు, విష్ణుమూర్తి, చిన్న ఆంజనేయులు మాదిగ, జూరాల రాములు మాదిగ తదితర యువకులు పాల్గొన్నారు.


Comments