మాటు చెరువు గండిపడడంతో రైతుల ఆందోళన
ఎల్కతుర్తి. మార్చి 1 (తెలంగాణ ముచ్చట్లు)
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం అనంతసాగర్ గ్రామం సరిహద్దులోని మాటు చెరువు గండిపడడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా చెరువు కట్ట దెబ్బతిని నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోవడంతో పంటలకు అవసరమైన నీటి నిల్వ లేకుండా పోయింది.
ఈ చెరువు నీటిపై ఆధారపడి సుమారు మూడు వందల మంది రైతులు తమ పంట పొలాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి పంటలకు నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోతాయనే భయం రైతుల్లో నెలకొంది.
చెరువుకు అనుసంధానంగా ఉన్న వంతెనలు కూడా నీటి ప్రవాహానికి కూలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. తక్షణ చర్యలు తీసుకోకపోతే రానున్న వర్షాకాలంలో కూడా నీరు నిల్వ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రైతులు తమ సొంత డబ్బులతో ఇసుక సంచులు తెచ్చి గండిపడిన ప్రాంతంలో తాత్కాలిక అడ్డుకట్ట వేస్తూ నీరు బయటకు పోకుండా కాపాడుతున్నారు. అయితే ఇది తాత్కాలిక పరిష్కారమేనని, ప్రభుత్వంవెంటనే స్పందించి చెరువు ఆనకట్టకు శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
రైతుల సమస్యను గుర్తించి అధికారులు తక్షణమే పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.


Comments