మన్యంలో 'మంచి' వైద్యం.. గిరిజనులకు కొండంత అండ!
● *రూ. 10.70 కోట్లతో చర్ల సిహెచ్సి అప్గ్రేడేషన్.. 30 పడకల ఆసుపత్రికి మంత్రి పొంగులేటి భూమిపూజ*
● *గిరిజన బిడ్డల ఆరోగ్యంపై రాజీ పడం..*
● *సిబ్బంది సమస్యలు తీర్చి... సేవలు మెరుగుపరుస్తాం : మంత్రి భరోసా*
ఖమ్మం బ్యూరో, మార్చి 1(తెలంగాణ ముచ్చట్లు)
గిరిజన పల్లెలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను రూ. 10.70 కోట్ల భారీ వ్యయంతో 30 పడకల అత్యాధునిక ఆసుపత్రిగా తీర్చిదిద్దే పనులకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం భూమిపూజ చేశారు.
*గిరిజన ప్రాంత అభివృద్ధియే లక్ష్యం..*
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏజెన్సీ
ప్రాంత గిరిజన బిడ్డలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా చర్ల హెల్త్ సెంటర్ను అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. "మన రాష్ట్రంలో వైద్య సేవలకు మంచి పేరుంది. వైద్య ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ ద్వారా నా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించి గిరిజనులకు మరింత మెరుగైన సేవలు అందేలా చూస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.
*రోగుల పరామర్శ.. భరోసా..*
అనంతరం ఆసుపత్రిలోని గిరిజన రోగులను మంత్రి పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స, మందుల సరఫరా గురించి ఆరా తీశారు. "మీకు తోడుగా ప్రభుత్వం ఉంది, ఆందోళన చెందకండి" అంటూ గిరిజన బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటిడిఎ పీఓ బి. రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


Comments