ప్రతి నెలలో ఒక రోజు ప్రజాప్రతినిధులతో "స్వచ్ఛ వంగర"
భీమదేవరపల్లి,మార్చి01 (తెలంగాణ ముచ్చట్లు):
వంగర గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతినెల నిర్వహిస్తున్న “స్వచ్ఛ వంగర” కార్యక్రమంలో భాగంగా ఆదివారం రెండో వార్డులో విస్తృత శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.రెండో వార్డులోని రహదారులు, కాలనీలు, కాలువలు మరియు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో శుభ్రపరిచారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి నెలలో ఒక రోజు ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ శుభ్రత ఒకరోజు కార్యక్రమం కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్ద శుభ్రత పాటించడం, చెత్తను క్రమబద్ధంగా పారవేయడం ద్వారా స్వచ్ఛమైన వంగరను నిర్మించగలమని చెప్పారు. ప్రజల సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓలాల రమేష్, వార్డు సభ్యులు మారం సతీష్, మిడిదొడ్డి తిరుపతి, రమేష్, కాల్వ అంజలి, రామారావు, స్వరూప, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments