పేదల గుడిసెల కూల్చివేత అమానుషం
మాజీ ఎంపీ నామ
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం నగర కార్పోరేషన్ పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూములల్లో నివసిస్తున్న వందలాది పేదల గుడిసెలను కూల్చివేయడం అత్యంత దురదృష్టకరమని బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఆక్షేపించారు. ఏళ్ల తరబడి అక్కడ నివసిస్తూ జీవనోపాధి సాగిస్తున్న పేద కుటుంబాలకు ముందస్తు గా ప్రత్యామ్నాయ నివాసం కల్పించకుండా గుడిసెలను కూల్చివేసి వారిని రోడ్డున పడవేయడం అత్యంత దుర్మార్గమైన చర్య” అని నామ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి, చెమటోడ్చి కట్టుకున్న పేదల ఇళ్లను క్షణాల్లో నేలమట్టం చేయడం పేదల గుండెలను పగలగొట్టే చర్య అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ కూల్చివేత సమయంలో మీడియాను కూడా రానివ్వకుండా అడ్డుకోవడం, పారదర్శకత లేకుండా చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. పేదలపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం సరైంది కాదని, ప్రభుత్వానికి బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. భూదాన్ భూములల్లో నివసిస్తున్న వారి వివరాలు సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు లేదా స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ నిలబడతుందని, వారి హక్కుల కోసం పోరాడతామని నామ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో అభివృద్ధి అవసరం ఉన్నప్పటికీ, అది పేదల జీవితాలను ఛిన్నాభిన్నం చేసేలా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Comments