కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాల్లో పాల్గొన్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)
కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం పాల్గొన్నారు. నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
వేడుకల్లో కార్డినల్ పూల అంతోని, ఖమ్మం మతపీఠాధిపతి సగిలి ప్రకాష్ లను ఎంపీ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవ మతానికి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర దేశమైన వాటికన్ సిటీ క్రైస్తవ మతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రపంచ కాథలిక్ విశ్వాసులను ఏకతాటిపైకి తెచ్చే కేంద్రంగా వాటికన్ నిలుస్తోందని, శాంతి, ప్రేమ, సేవా భావాలే క్రైస్తవ మత ప్రధాన సందేశమని వివరించారు.
కరుణగిరి పుణ్యక్షేత్రం కూడా ఆ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతిబింబంగా జిల్లాలో విశ్వాసులను ఆకర్షిస్తోందని ఎంపీ అన్నారు. మన తెలుగు వ్యక్తి పూల అంతోనీకి కార్డినల్ గా అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ఆయనను సత్కరించారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
*ఈ కార్యక్రమంలో..:* ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మార్కెట్ చైర్మన్ హరినాధ బాబు, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఇమామ్ భాయ్, రంజిత్ నాయక్, కౌన్సిలర్లు ఏనుగు స్వర్ణ, దివ్య తదితరులు పాల్గొన్నారు.


Comments