వనపర్తిలో కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్
2026-27 నుంచే విద్యాబోధన ప్రారంభం.
వనపర్తి, మార్చ్3(తెలంగాణ ముచ్చట్లు):
విద్యాపర్తిగా పేరొందిన వనపర్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది.వనపర్తి జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అనుమతులు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరంనుంచే విద్యాబోధన ప్రారంభం కానుంది.నాగవరం శివారులోని యువత శిక్షణ కేంద్రం ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.సంబంధిత దస్త్ర సంఖ్య 39810, ఫైలు సంఖ్య 11072-6 (తెలంగాణ) 2025-పాలన-1/2274-94 ప్రకారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి వినతి మేరకు స్పందించిన కేంద్రీయ విద్యాలయ సంస్థ 03-10-2025న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వనపర్తిలో విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అనంతరం 03-03-2026న యువత శిక్షణ కేంద్రం ప్రాంగణంలో పాఠశాల నిర్వహణకు పూర్తిస్థాయి అనుమతులు మంజూరయ్యాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం స్థాపనతో వనపర్తి జిల్లా విద్యారంగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి నియోజకవర్గాన్ని విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.


Comments