చీర మెడకు చుట్టుకుని ప్రమాదవశాత్తు బాలిక మృతి
జవహర్ నగర్, మార్చి 3 (తెలంగాణ ముచ్చట్లు):
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాప్రా ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 8 సంవత్సరాల బాలిక ప్రమాదవశాత్తు ఊయలలో మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల ప్రకారం, టి. నవనీత అనే మహిళకు పవిత్ర (8 సంవత్సరాలు), ఆరాధ్య (7 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తతో వైవాహిక విభేదాల కారణంగా ఆమె భర్త నుండి వేరుగా ఉంటూ గృహ సేవకురాలిగా పనిచేస్తోంది. పెద్ద కుమార్తె పవిత్ర గత పది రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.తేదీ 02.03.2026 సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో పవిత్ర తన చిన్న చెల్లెలు కోసం చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటూ ఉండగా, తల్లి నవనీత నెల జీతం తీసుకునేందుకు సమీపంలోని ఇంటికి వెళ్లింది. సుమారు గంట తర్వాత తిరిగి వచ్చి చూడగా, పవిత్ర చీర మెడకు గట్టిగా చుట్టుకుని ఊయల నుండి వేలాడుతూ కనిపించినట్లు తెలిపారు.వెంటనే బాలికను సమీపంలోని లైఫ్లైన్ హాస్పిటల్ కు తరలించగా, విధుల్లో ఉన్న వైద్యులు బాలిక అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతి స్థానికులను తీవ్రంగా కలచివేసింది.


Comments