ప్రమాదాలకు చెక్… ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
సీఐ జి. వేణు
స్టేషన్ ఘనపూర్, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. స్టేషన్ ఘనపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. వేణు ఆధ్వర్యంలో స్టేషన్గన్పూర్ లోని హోలీ క్రాస్ స్కూల్ ఇప్పగూడలోని శ్రీ బసరా స్కూల్ సమీపంలో ప్రమాద ప్రాంతంగా గుర్తించిన చోట “GO SLOW – ACCIDENT ZONE” హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఐ జి. వేణు మాట్లాడుతూ, ఈ మార్గంలో వాహనదారులు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పాఠశాల సమీప ప్రాంతం కావడంతో విద్యార్థులు మరియు స్థానిక ప్రజల భద్రత దృష్ట్యా వాహనాలు నెమ్మదిగా నడపాలని సూచించారు.
అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్బెల్ట్ వినియోగించాలని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.
ప్రజల ప్రాణ భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ప్రతి వాహనదారుడు బాధ్యతతో వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని సీఐ జి. వేణు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.


Comments