దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లు పంపిణీ
_ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలి
– జిల్లా కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్–మల్కాజ్గిరి, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు):
దివ్యాంగులు ప్రభుత్వం అందించే పథకాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆర్థికంగా ఎదగాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. వారికి అవసరమైన మార్గనిర్దేశం, సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.సోమవారం అల్వాల్లోని సఖీ సెంటర్లో జిల్లా మహిళా, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మను చౌదరి 56 ట్రైసైకిళ్లు, 14 వీల్ ఛైర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దివ్యాంగులు మానసిక ధైర్యంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. మానసిక ధైర్యం ఉంటే అవకలనం అడ్డంకి కాదని, అన్ని రంగాల్లో దివ్యాంగులు రాణించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే రేపు మెరుగైన స్థాయికి చేరుకోవాలనే సంకల్పంతో ప్రయత్నిస్తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని తెలిపారు.దివ్యాంగులు సొంతంగా వ్యాపారం, స్టార్టప్లు లేదా చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే వారి పిల్లల విద్య, కెరీర్ నిర్మాణానికి అవసరమైన కౌన్సెలింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు వంటి అంశాలలో కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.ఈసారి వీల్ ఛైర్లు, ట్రైసైకిళ్లు అందని అర్హులైన వారికి తదుపరి దశలో తప్పకుండా అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్తో కలిసి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లను పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ సఖీ సెంటర్ను పరిశీలించి అక్కడి సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, ఆర్డీఓ ఓం ప్రకాష్, అల్వాల్ తహసీల్దార్ రాములు, డీడబ్ల్యూఓ శారద తదితరులు పాల్గొన్నారు.


Comments