చర్లపల్లిలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్–2026 ప్రారంభం
పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు):
పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీఐఏ ఆడిటోరియంలో చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్–2026ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐఏ అధ్యక్షుడు డి. శ్రీనివాసరెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు కొండవీటి సుధీర్ రెడ్డి, చర్లపల్లి ఐఎల్ఏ అధ్యక్షుడు గోవిందరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేయడంలో, మార్కెట్ అవకాశాలను పెంపొందించడంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని, పారిశ్రామికవేత్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కోసం ప్రత్యేక కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఎగ్జిబిషన్లో పరిశ్రమలలో వినియోగించే పలు రకాల యంత్రాలు, ఉత్పత్తులతో పాటు బ్యాంకుల స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐఏ కార్యదర్శి మోహన్, చర్లపల్లి ఐఎల్ఏ ఉపాధ్యక్షులు తాటి శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు కట్టంగూరి హరీష్ రెడ్డి, మిరుపాల గోపాల్ రావు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, గంగాధర్ బాబు, కమిటీ సభ్యులు మరియు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


Comments