సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతి సభ
_మహిళా విద్యాభివృద్ధికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం – వక్తలు
కాప్రా, మార్చి 10 ( తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం కమలానగర్ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి గ్రూప్ నాయకురాలు అనురాధ, సామాజిక ఉద్యమ నేత పి. సత్యం సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అనురాధ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే దేశంలో తొలి మహిళా గురువుగా నిలిచి మహిళా విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు.సమాజంలో మహిళలు చదువుకుంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని నమ్మి అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ బాలికల కోసం పాఠశాలలను ప్రారంభించారని గుర్తు చేశారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.సామాజిక ఉద్యమ నేత పి. సత్యం మాట్లాడుతూ మహిళల విద్య, సమానత్వం కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి అపారమని అన్నారు. సమాజంలో ఉన్న కులవివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా పోరాడి మహిళలకు విద్యా హక్కు కల్పించేందుకు పాఠశాలలను స్థాపించారని తెలిపారు.సమానత్వం, లౌకికతత్వం, రాజ్యాంగ విలువలను కాపాడే విధానాలు అమలు చేయాలని ఆయన కోరారు.అనంతరం శ్రీమన్నారాయణ మాట్లాడుతూ దేశంలో సామాజిక పరిణతికి కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమ నేత, చరిత్రకారుడు కే.ఎన్. ఫణిక్కర్ మరణించడం విచారకరమని పేర్కొన్నారు. అలాగే పేదల పక్షాన పోరాటం చేసిన గంగ దేవరపల్లి రాజమౌళి మరణానికి సంతాప సూచకంగా కొద్దిసేపు మౌనం పాటించారు.అనంతరం సభ్యులందరూ సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో శ్రీమన్నారాయణ, సోమయ్య, రుక్కయ్య, సామాజిక కార్యకర్త కోమటి రవి, ఎం. భాస్కర్ రావు, లక్ష్మయ్య, శశాంక్, జయరాజు, సిఐటియు నాయకులు రాజశేఖర్, గణేష్, ఉన్నికృష్ణ, ఎన్. శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్, లింగస్వామి, నరేష్, మహిళలు శారదా, శోభ, గౌసియా తదితరులు పాల్గొన్నారు.


Comments