ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు.చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, కీసర పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో నిందితులు అమర్ రాజ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ లతీఫ్ ఖాన్, గులాం హుస్సేన్ ఖాన్లను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి ఉప్పల్, కీసర ప్రాంతాల్లో ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకుని విచారించగా, అనేక చోరీ కేసుల్లో వారి ప్రమేయం బయటపడింది.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.13 లక్షల విలువైన 65 గ్రాముల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు మోటార్ సైకిళ్లు, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Comments