డ్రగ్స్ నియంత్రణపై వేలేరు పోలీసుల అవగాహన సమావేశాలు
వేలేరు, మార్చ్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మరిపేట, మల్లికుదుర్ల, షోడశపల్లి, వేలేరు గ్రామాల్లో డ్రగ్స్ నియంత్రణపై విస్తృత అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ ఎ. పూర్ణేశ్వర్ అధ్యక్షత వహించారు.
TGNAB ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ పూర్ణేశ్వర్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయం మరియు వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలు మరియు మంచి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ సమస్యను అరికట్టడం మరియు యువతలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు.


Comments