పెద్దమందడి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి – ఈసారైనా దళితులకు అవకాశం దక్కుతుందా?
పెద్దమందడి,మార్చి10(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్ష పదవికి ఆశావాహుల నుండి వినతులు స్వీకరించారు.ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.మండల అధ్యక్ష పదవిని ఆశిస్తున్న పలువురు నాయకులు తమ వినతిపత్రాలను సమర్పించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా ఈసారి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో దళితులకు అవకాశం కల్పించాలనే అభిప్రాయం కార్యకర్తలలో వినిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న దళిత సీనియర్ నాయకులు మండలంలో చాలామంది ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాజకీయాల్లో ఎక్కడ చూసినా బీసీ నినాదం వినిపిస్తున్నప్పటికీ, మరోవైపు అగ్రవర్ణ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందనే అభిప్రాయం కూడా కార్యకర్తలలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఈసారి దళిత నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే చర్చ మండల కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.మండలంలో పార్టీ బలోపేతానికి దళిత నాయకులు కూడా గణనీయంగా కృషి చేస్తున్నారని, వారి సేవలను గుర్తించి మండల అధ్యక్ష పదవిలో వారికి అవకాశం కల్పించాలని కొందరు కార్యకర్తలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందనే అంశంపై స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


Comments