మల్కాజ్గిరిలో ఆకస్మిక తనిఖీలు
_పారిశుధ్యంపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కఠిన ఆదేశాలు
మల్కాజ్గిరి, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలవుతున్న 99 రోజుల కార్యాచరణలో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఆనంద్బాగ్ చౌరస్తా వద్ద స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్లతో సమావేశమైన కమిషనర్ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాలని సూచించారు. ఒక ప్రాంతంలో బహిరంగంగా చెత్త కనిపిస్తే సంబంధిత స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్ల పనితీరు సరిగా లేదని భావిస్తామని హెచ్చరించారు.కిరాయిదారులు రోడ్లపై చెత్త వేయకుండా ఇంటి యజమానులు అవగాహన కల్పించాలని సూచించారు.కిరాయిదారులు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే ఇంటి యజమానులపై జరిమానా విధిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారికి చెత్త నిర్వహణపై అవగాహన లేకపోవడం వల్ల నగరంలో అపరిశుభ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్లు ఇంటింటికి వెళ్లి నిరుపయోగ వస్తువులను కూడా సేకరించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో చెత్త సేకరణ చేపట్టాలని తెలిపారు. ప్రజలు ఆన్లైన్ ద్వారా చేసే ఫిర్యాదులను గంటలోపే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఏలకు ఆదేశించారు.మల్కాజ్గిరి–మౌలాలీ ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, వాటిని నిర్ణీత ప్రదేశాల్లో భద్రపరచాలని అధికారులకు సూచించారు. అలాగే గ్రీన్ వేస్ట్ తొలగించేందుకు ప్రతి సర్కిల్కు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా, ఏసీ శానిటేషన్ రఘుప్రసాద్, డీఈఈ మహేశ్వర్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్), సూపర్వైజర్ చింత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments