వ్యవసాయ ఉత్పతుల కొనుగోళ్లలో ప్రైవేట్ ఏజెన్సీల పాత్ర ఏంటి..?
* పారదర్శకతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు తెలపండి
* *రైతుల ప్రయోజనాలు కాంక్షిస్తూ లోక్ సభలో వివరాలు కోరిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి*
ఖమ్మం బ్యూరో, మార్చి 10(తెలంగాణ ముచ్చట్లు)
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రైవేట్ ఏజెన్సీల పాత్ర, వాటి ఎంపిక ప్రమాణాలు, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్సభలో కోరారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రైవేట్ కొనుగోళ్లు మరియు ప్రభుత్వ మద్దతు పథకాల మధ్య సమతుల్యత ఎలా కొనసాగిస్తున్నారో వెల్లడించాలని ప్రశ్నించారు.
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖల సహాయ మంత్రి భగీరథ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
*పీఎం–ఆశా ద్వారా మద్దతు ధర*
ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (పీఎం–ఆశా)లోని పీఎస్ఎస్ కింద పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర నోడల్ ఏజెన్సీలుగా నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు, సహకార మార్కెటింగ్ సమాఖ్యలు కొనుగోళ్లను నిర్వహిస్తున్నాయని వివరించారు.
▪ *కొనుగోలు కేంద్రాల ఏర్పాటు*n
రైతులకు సౌలభ్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఉత్పత్తి, మార్కెటింగ్ అవసరాలు, నిల్వ మరియు రవాణా సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
▪ *రైతుల ఖాతాల్లోకే చెల్లింపులు..*
కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు కొనుగోళ్లు నిర్వహించే తేదీలు, కేంద్రాల వివరాలు, నాణ్యత ప్రమాణాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు వివరించారు.


Comments