ఉప్పల్ భగాయత్ అభివృద్ధికి రూ.13 కోట్ల నిధులు మంజూరు
_కమ్యూనిటీ హాల్, 10 కిలోమీటర్ల బ్లాక్టాప్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
_ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి ఫలితం
ఉప్పల్, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ భగాయత్ ప్రాంత అభివృద్ధికి రూ.13 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి, సహకారంతో ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పలుమార్లు సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించిన హెచ్ఎండిఏ అధికారులు ఈ నిధులను వివిధ అభివృద్ధి పనుల కోసం ఆమోదించినట్లు తెలిపారు.ఈ నిధులలో భాగంగా రూ.3 కోట్ల 40 లక్షల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అలాగే రూ.9 కోట్ల 60 లక్షలతో సుమారు 10 కిలోమీటర్ల మేర బ్లాక్టాప్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి కాలనీలో రహదారి సౌకర్యాలను మెరుగుపరచనున్నారు.హెచ్ఎండిఏ లేఔట్ పరిధిలోని రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు 42 మంది పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయి.అదేవిధంగా లేఔట్లో రైతు బజార్ కోసం కేటాయించిన స్థలంలో కూరగాయల వ్యాపారం సక్రమంగా జరిగేలా అభివృద్ధి పనులు చేపట్టాలని, అలాగే సుమారు 8 ఎకరాల పార్కు స్థలానికి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు, పెద్దలు మరియు పిల్లలకు ఆటవిడుపు కోసం అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.ఇక వెస్ట్ సైడ్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన సంబంధిత అధికారులతో చర్చించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments