విద్యార్థుల ప్రతిభకు వెబ్సైట్ ద్వారా గుర్తింపు కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్–మల్కాజిగిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులలోని కళలు మరుగున పడకుండా వాటికి సరైన గుర్తింపు లభించేలా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి అందులో విద్యార్థుల ప్రతిభను అప్లోడ్ చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు.బుధవారం ఘట్కేసర్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం సమయానికి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో అందుతున్న బోధన విధానంపై కూడా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.కూచిపూడి, గిటార్, కీబోర్డ్, పెయింటింగ్ వంటి విభాగాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల సంఖ్య, సర్టిఫికెట్ కోర్సుల వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులు వేసిన పెయింటింగ్లను పరిశీలించి, ఒక కొత్త వెబ్సైట్ రూపొందించి అందులో విద్యార్థుల చిత్రాలను ఉంచితే ఆసక్తి గలవారు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్న విద్యార్థులను ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ వారికి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆడుకోవడానికి ఫుట్బాల్, చెస్, వాలీబాల్తో పాటు ఆర్ట్స్కు అవసరమైన సామగ్రి అందించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అవసరమైన వస్తువులు తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు.స్కూల్ యాజమాన్యం అవసరమైన వస్తువులు, విద్యార్థులు కోరిన క్రీడా సామగ్రి వివరాలతో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అనంతరం స్టోర్రూమ్ను పరిశీలించిన కలెక్టర్ ఎక్స్పైరీ డేట్లను తనిఖీ చేస్తూ గడువు లోపే వంట సామగ్రిని వినియోగించాలని, నాణ్యమైన పదార్థాలనే ఉపయోగించాలని సూచించారు.


Comments