విద్యారంగానికి కేవలం 8.2% కేటాయింపు తీవ్ర అన్యాయం
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితి కళావేదిక అధ్యక్షులు
వనపర్తి,మార్చి21(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం నిధులు మాత్రమే కేటాయించడం తీవ్ర అన్యాయమని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మండిపడ్డారు.విద్యా రంగ అభివృద్ధికి ఈ కేటాయింపులు అసలు సరిపోవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మొత్తం రూ.3,24,234 కోట్ల బడ్జెట్లో కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే విద్యారంగానికి కేటాయించడం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకపోవడం శోచనీయమన్నారు.ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో కొన్ని పాఠశాలలపై మాత్రమే దృష్టి పెట్టి, ప్రభుత్వ సాధారణ పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు.విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.పిఆర్సి గడువు ముగిసి 32 నెలలు అవుతున్నా ఇప్పటికీ నివేదిక తీసుకురాకపోవడం, బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు. అలాగే 2024 మార్చి నుంచి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షన్ బకాయిల చెల్లింపులపై ఎలాంటి స్పష్టత లేకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.విద్యాశాఖను స్వయంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి విద్యారంగంపై ఇంత చిన్నచూపు చూపడం బాధాకరమని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని విద్యారంగానికి మరింత నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని పలుస శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.


Comments