జీవిత పోరాటంలో ఓడిపోయిన యువకుడు
జమ్మికుంట టౌన్, మార్చ్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కేశవపూర్కు చెందిన పాతకాల కిషన్ (30) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చెల్లెలి వివాహం కోసం చేసిన ఖర్చులు, తండ్రి అనారోగ్య చికిత్సకు వచ్చిన భారంతో కుటుంబ పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కిషన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుని తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్థిక ఇబ్బందులే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కిషన్ మృతి కుటుంబానికి తీరని లోటుగా మారింది.


Comments