వనపర్తిలో తాగునీటి సరఫరాపై ఎమ్మెల్యే సమీక్ష.. అధికారులపై ఆగ్రహం
వనపర్తి,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు):
వేసవి నేపథ్యంలో వనపర్తి పట్టణ తాగునీటి సరఫరాపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నీటి సరఫరాలో లోపాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రామన్పాడు, ఎర్రగట్టు, కానాయపల్లి, గుంపుగట్టు ప్రాంతాల నుంచి సరఫరా అయ్యే తాగునీటి పరిస్థితిపై అధికారులను ప్రశ్నించారు.చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే పెద్ద సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన లోపాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.విద్యుత్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.తాగునీటి సరఫరాకు నియమించిన సిబ్బందిని ఇతర పనుల నుంచి తొలగించి, అదే పనికి వినియోగించాలని ఆదేశించారు.పట్టణంలో ఉన్న బోర్లను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని, మోటర్లు లేని బోర్లను వెంటనే సరిచేయాలని సూచించారు.కాలనీల్లో నీటి వృథా నివారణకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన మాన్పవర్ పెంచాలని చెప్పారు.పని విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించిన ఎమ్మెల్యే, పాత విధానాలు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వారం రోజుల్లో తాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని అధికారులకు గడువు విధించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ మరియు మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.


Comments