స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
ఖమ్మం బ్యూరో,మార్చి 17(తెలంగాణ ముచ్చట్లు)
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో మంగళవారం ముందస్తు రంజాన్ పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.పాఠశాల చిన్నారులు తమ మిత్రులకు ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఖర్జూరాలు,పండ్లు, సేమియాలు అందించి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటారు. మతసామరస్యానికి ప్రతీకగా పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులు రంజాన్ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రపంచమంతటా మతసామరస్యాన్ని చాటుతూ రంజాన్ వేడుకలను నిర్వహించి తోటి మానవుల పట్ల తమ ఆదరాభిమానాలను ప్రదర్శించే పండుగ రంజాన్ పర్వదినం అని పేర్కొన్నారు. కఠోర ఉపవాసాన్ని ఆచరించి చివరి రోజు ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ మత గ్రంథం దివి నుంచి భూమికి చేరిన పవిత్ర మాసం అని తెలియజేశారు. ఓర్పు,సహనం, త్యాగనిరతి,పరోపకారం,దానధర్మ భావనలు రంజాన్ పర్వదినం మనకి అందరికీ సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


Comments