వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు తోడు.!
సత్తుపల్లి నియోజకవర్గంలో రాయితీ పనిముట్ల పంపిణీ.
సత్తుపల్లి, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు యాంత్రీకరణ పద్ధతులను అవలంబించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సూచించారు. సోమవారం సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025–26 కింద రాయితీ పనిముట్లను పంపిణీ చేశారు. సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీపై రోటావేటర్లు, బేలర్లు, స్ప్రేయర్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా లేక పెట్టుబడి భారంగా మారుతోందన్నారు. రైతులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సాంకేతికత, యాంత్రీకరణకు ప్రాధాన్యం పెరుగుతోందని, రైతులు ఆధునిక పద్ధతులను స్వీకరించి ఉత్పాదకత పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, సత్తుపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments