పామిరెడ్డిపల్లిలో ఘనంగా ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ శ్రీశైల మల్లికార్జున నాటకం
పెద్దమందడి,మార్చి16(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ శ్రీశైల మల్లికార్జున నాటకం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరై నాటకోత్సవాన్ని ప్రారంభించారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి సహకారంతో పాటు స్పాన్సర్ల అండతో ఈ నాటక కార్యక్రమాన్ని నిర్వహించారు.నిర్వాహకులు యాదయ్య గౌడ్, కొంటెమోని మహేష్, డోలు శ్రీశైలం, సీలయ్య గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం వైభవంగా సాగింది.మొదటి రోజు భజన మండలి, నాట్య మండలి సభ్యులు పాల్గొని భక్తి గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.ఐదు రోజుల పాటు ఈ నాటక ప్రదర్శనలు గ్రామంలో కొనసాగనున్నాయి.నాటక ప్రదర్శన నటిమణి, సూత్రదారితో ప్రారంభమై చంద్రగుప్త మహారాజు సంతాన ఫలమునకు అడవిలో ఘోర తపస్సు చేయడం, ఆ తపస్సుకు శివుడు ప్రత్యక్షమై వరం ప్రసాదించడం వరకు కథాంశాన్ని ప్రదర్శించారు.5 రోజుల నాటకోత్సవానికి ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.


Comments