కాప్రా సర్కిల్లో దోమల బెడద తీవ్రం వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి
_డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించిన కాలనీవాసులు
– ఫాగింగ్, పారిశుధ్య చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్
కాప్రా, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్.రావు నగర్, కుషాయిగూడ, చర్లపల్లి డివిజన్లలో దోమల బెడద తీవ్రంగా పెరిగిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఫాగింగ్ యంత్రాల ద్వారా ప్రతి వీధిలో దోమల నివారణ చర్యలు చేపట్టేవారని, దీంతో సమస్య కొంతవరకు నియంత్రణలో ఉండేదని వారు తెలిపారు. అయితే గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం అయిన తరువాత దోమల నివారణ చర్యలు సక్రమంగా చేపట్టడం లేదని ఆరోపించారు.ఫాగింగ్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించకపోవడంతో దోమల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జ్వరాలు, వైరల్ వ్యాధులతో బాధపడుతున్నారని, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు.కాప్రా డివిజన్ పరిధిలో వెంటనే ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ను వారు కోరారు. అదేవిధంగా కాలువలు, చెత్త నిల్వలు, నిల్వ నీటి ప్రాంతాలను శుభ్రపరిచి దోమల పెరుగుదలను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Comments