కీసర లో దోమల బెడద తీవ్ర వెంటనే చర్యలు తీసుకోవాలి.
_ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ వసంతకు వినతిపత్రం
_మాజీ వార్డు సభ్యులు తుడుం శ్రీనివాస్ డిమాండ్
కీసర, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని కీసర ఉమ్మడి గ్రామంతో పాటు అంకిరెడ్డిపల్లి, చీర్యాల, యాద్గర్పల్లి, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి గ్రామాలలో తీవ్రంగా పెరిగిన దోమల సమస్యను వెంటనే అరికట్టాలని కీసర గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు తుడుం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కీసర సర్కిల్–1 ప్రజల తరఫున ఆయన కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వసంతకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో గ్రామపంచాయతీ పాలనలో సర్పంచులు, సెక్రటరీలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫాగింగ్ యంత్రాల ద్వారా ప్రతి వీధిలో దోమల నివారణ చర్యలు చేపట్టేవారని తెలిపారు. దీంతో దోమల సమస్య కొంతవరకు నియంత్రణలో ఉండేదని పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం ఈ గ్రామాలను గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేసిన తర్వాత దోమల నివారణ చర్యలు సరైన విధంగా చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. ఫాగింగ్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో దోమల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.దోమల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు జ్వరాలు, వైరల్ వ్యాధులతో బాధపడుతున్నారని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీసర డివిజన్–1 పరిధిలో వెంటనే ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ను కోరారు.అదేవిధంగా కాలువలు, చెత్త నిల్వలు, నిల్వ నీటి ప్రాంతాలను శుభ్రపరిచి దోమల పెరుగుదలను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Comments