రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి.!
ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏఐయుకేఎస్ ధర్నా.
దమ్మపేట, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా (రైతు బంధు)ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ మండల కార్యదర్శి పండూరి వీరబాబు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ సభ్యులు ఊకె అప్పారావు, కాక వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు సకాలంలో స్పందించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతు భరోసాను పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే రైతులకు అవసరమైన సమయంలో ఇప్పటికీ రైతు భరోసా అందకపోవడం వల్ల పంటల పెట్టుబడులకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షాకాలం ముగిసి యాసంగి (రబీ) సీజన్ సగం గడిచినా రైతు భరోసా విడుదల కాలేదని పేర్కొన్నారు. రైతులు భూములు చదును చేయడం, విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు వేయడం వంటి పనుల కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారని, ఈ పరిస్థితుల్లో రైతు భరోసా అందకపోవడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని, పోడు సాగుదారులపై అటవీ అధికారుల దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం వంటి చర్యలు అన్యాయమని ఆరోపించారు.
అలాగే పంటలకు కనీస మద్దతు ధరలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.2400 కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ మార్కెట్లో రైతులకు రూ.1600 నుంచి రూ.1700 వరకు మాత్రమే ధర లభిస్తోందని చెప్పారు. ఎర్రజొన్నలకు కూడా ప్రకటించిన మద్దతు ధర అమలు కావడం లేదని తెలిపారు. అందువల్ల మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న, ఎర్రజొన్న పంటలను కొనుగోలు చేయాలని, వ్యవసాయ మార్కెట్లలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తామరాముడు, కుంజ కాంతారావు, తెల్లం నాగేష్, రుక్కోల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments