మేడ్చల్ కలెక్టరేట్లో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహణ
_కెమికల్ ప్రమాదాలు, బాంబ్ బ్లాస్ట్లకు స్పందనపై అవగాహన
మేడ్చల్–మల్కాజ్గిరి, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలోని కర్మాగారాలు, పరిశ్రమల్లో జరిగే కెమికల్ బ్లాస్ట్లు, లీకేజీలు, అలాగే బాంబ్ పేలుళ్ల వంటి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించారు.ఈ మాక్ డ్రిల్లో ప్రమాద సమయంలో గాయపడిన వారిని ఎలా రక్షించాలి, కాలుష్య ప్రభావాన్ని ఎలా తగ్గించాలి, పరిస్థితులను ఎలా నియంత్రించాలి వంటి అంశాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. కెమికల్ బ్లాస్ట్ల వల్ల విడుదలయ్యే వాయువుల ప్రభావాన్ని అంచనా వేసి పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలను ఎన్డీఆర్ఎఫ్ అధికారి గౌతం కుమార్ వివరించారు.ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించే విధానం, ఫీల్డ్ ఆపరేషన్లలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో తెలిపారు. ప్రమాద స్థలాల్లో సిబ్బంది ఎక్కువసేపు పనిచేయాల్సి ఉండటంతో రక్షణ కోసం ప్రత్యేక కిట్లు, మాస్కులు, గ్లౌజులు, ప్రొటెక్టివ్ డ్రెస్సులు ఉపయోగించడం అవసరమని వివరించారు.ఇలాంటి ఘటనల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కల్పించింది. మాక్ డ్రిల్లో క్లోరిన్ రసాయనం లక్షణాలు, దాని ప్రభావాలపై సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, కర్మాగారాలు, వైద్య విభాగాల సమన్వయంతో నిర్వహించబడింది.ఈ మాక్ డ్రిల్లో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదనపు డీసీపీలు వెంకట్ రెడ్డి, హనుమంతరావు, డిఆర్ఓ చంద్రావతి, కేంద్ర–రాష్ట్రప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



Comments