హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎల్కతుర్తి మండల బిజెపి అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్
ఎల్కతుర్తి, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఎల్కతుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఎకరాకు ₹6000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు.
అలాగే యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, కళ్యాణ లక్ష్మి, గృహ నిర్మాణ పథకం, రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి కీలక హామీలు అమలులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు.
మండలంలోని రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు భరోసా సమయానికి అందకపోవడంతో అప్పులపాలవుతున్నారని తెలిపారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
పేదలకు గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని, భూభారతి రెవెన్యూ సదస్సులో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు.
అదేవిధంగా ఆదాయం, కుల, నివాస ధృవీకరణ పత్రాల జారీ లో జాప్యం జరుగుతోందని, అర్హులైన వారికి సమయానికి ధృవీకరణ పత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జనగాం కిష్టయ్య, ఆడెపు శ్రీ వర్ధన్, చిదూరల వెంకటేష్, పల్లెపాటి మధుకర్, బీట్ల లింగయ్య, కోడం రమేష్, ఠాకూర్ శంసింగ్, వంగ రమేష్, కొలిపాక శ్రీనివాస్, కనుకుంట్ల రమణాచారి, మాట్ల విద్యాసాగర్, సూది రెడ్డి సాయికృష్ణ, దాసరి సాయి తేజ, సప్పిరాజు, చిర్ర శ్రీనివాస్, పోలు శివ, నాంపల్లి విష్ణువర్ధన్, నన్నబోయిన సంపత్, హింగే దేవరావు, తక్కాలపల్లి సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.


Comments