వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
- 50%కు పైగా నష్టమంటూ రైతుల ఆవేదన వెల్లడి.
- ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా) రకంపై రైతుల అసంతృప్తి.
సత్తుపల్లి, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం సిధ్ధారం గ్రామానికి చెందిన రైతులు రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ను కలిసి తమ గోడును వినిపించారు. రబీ సీజన్లో శ్రీరామ్ సీడ్స్ కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా) రకం వరి విత్తనాలతో సాగు చేసినట్లు తెలిపారు.
రైతుల వివరాల ప్రకారం, పంట మొదట బాగానే పెరిగినప్పటికీ, వరి ఈనిన తర్వాత 50 శాతం పైగా తాలు గింజలు కనిపించాయని తెలిపారు. మంచి దిగుబడి ఆశించి పెట్టుబడులు పెట్టిన తమకు ఈ పరిస్థితి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఇలా అన్ని విధాలా భారీగా ఖర్చు చేసినప్పటికీ, నాణ్యమైన ధాన్యం రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. నమ్మకంతో కొనుగోలు చేసిన విత్తనాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాలు గింజలు అధికంగా రావడానికి కారణాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ తుమ్మల యుగంధర్ను విజ్ఞప్తి చేశారు.


Comments