హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు సుందరీకరణకు శ్రీకారం
_రూ.30 కోట్లతో అభివృద్ధి
– డిజైన్లు పూర్తి, త్వరలో పనుల ప్రారంభం
నాచారం, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్ పరిధిలోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన డిజైనింగ్ ప్రక్రియ పూర్తయింది. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిజైనింగ్ పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ ఏజెన్సీ ప్రతినిధులు యూసుఫ్, శ్రీనాథ్లతో కలిసి చెరువును పరిశీలించారు. చెరువు అభివృద్ధి ఎలా ఉండాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు.చెరువులో గుర్రపు డెక్క అధికంగా పెరగడంతో నాచారం ప్రాంత ప్రజలు దోమల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.సమస్యను దృష్టిలో ఉంచుకుని చెరువులోని నీటిని తక్షణమే తొలగించి శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.దీనిపై స్పందించిన ఏజెన్సీ ప్రతినిధులు నీటి తొలగింపుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.గత 30-40 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ చెరువుకు ప్రస్తుతం ప్రత్యేక ప్రాధాన్యం లభించడం పట్ల హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments