2 బిహెచ్కె కాలనీల్లో 992 వాణిజ్య సముదాయాల వేలం
_మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో మార్కెట్ రేటుతో కనీస ధర నిర్ణయం
– మార్చి నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి
మేడ్చల్–మల్కాజ్గిరి, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని 2 బిహెచ్కె కాలనీల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం 16 కాలనీలలోని 992 వాణిజ్య సముదాయాలను మార్చి నెలాఖరు వరకు వేలం వేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వివిధ మున్సిపల్ శాఖల అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రతినిధులు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య సముదాయాల చదరపు అడుగుకు మార్కెట్ విలువను పరిశీలించి, అదే ధరను కనీస ధరగా నిర్ణయించాలని సూచించారు.వేలంలో పాల్గొనే వారు 3% నుంచి 10% వరకు ముందస్తు హామీ సొమ్ము (ఈఎండి) చెల్లించేలా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.వాణిజ్య సముదాయాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా 2 బిహెచ్కె
కాలనీల అభివృద్ధి పనులకే వినియోగించాల్సిన నిబంధనలు ఉన్నట్లు తెలిపారు.అలాగే కనీస ధర నిర్ణయానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ కన్వీనర్గా, అడిషనల్ కలెక్టర్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ సభ్యులుగా ఉండే కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.


Comments