తెలంగాణలో బంజారాలకు అన్యాయం
ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్ ఆరోపించారు. రాష్ట్రంలో గణనీయమైన జనాభా కలిగిన బంజారా సమాజం రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని తెలిపారు.ఇటీవల ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీలో బంజారా వర్గానికి ఒక్క ప్రతినిధికి కూడా అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో బంజారా సమాజం ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ, ఆ కృషికి తగిన గుర్తింపు లభించలేదని అన్నారు.
మంత్రివర్గంలో కూడా బంజారా వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని తెలిపారు. రాజకీయంగా కీలకమైన వర్గాన్ని పక్కన పెట్టడం సమంజసం కాదని, ఇది భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులకు దారితీసే అవకాశముందని హెచ్చరించారు.
బంజారా సమాజానికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం, వారి కృషిని గౌరవించడం అవసరమని, ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని డిమాండ్ చేశారు. లేదంటే బంజారా సమాజం తమ హక్కుల కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని స్పష్టం చేశారు.


Comments