మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్
అనాథ వృద్ధురాలికి కంటిచూపు ప్రసాదం
మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్
అనాథ వృద్ధురాలికి కంటిచూపు ప్రసాదం
ఖమ్మం బ్యూరో, మార్చి 18(తెలంగాణ ముచ్చట్లు)
"సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అన్న సూక్తిని నిజం చేస్తూ, ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త పల్లా కిరణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కంటిచూపు కోల్పోయి చీకటిలో మగ్గుతున్న ఒక అనాథ వృద్ధురాలికి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించి, ఆమె జీవితంలో వెలుగులు నింపారు. ఖమ్మం నగరంలోని సెయింట్ మేరీస్ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న మంగా కృష్ణకుమారి అనే వృద్ధురాలు వృద్ధాప్య సమస్యల కారణంగా కంటిచూపు కోల్పోయారు. ఇటీవల పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో ఆమె పరీక్షలు చేయించుకోగా, వైద్యులు తక్షణమే ఆపరేషన్ అవసరమని సూచించారు. దిక్కులేని అభాగ్యురాలైన ఆమె పరిస్థితిని తెలుసుకున్న పల్లా కిరణ్, తక్షణమే స్పందించారు. నగరంలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో నిపుణులైన వైద్యులచే ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేయించి, తన సొంత ఖర్చులతో విజయవంతంగా కంటి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అనంతరం ఆమెకు అవసరమైన కళ్ళజోళ్ళు, మందులు మరియు ఐ డ్రాప్స్ను కూడా ఉచితంగా అందజేశారు.
రెండు దశాబ్దాల సేవా ప్రస్థానం:
పల్లా కిరణ్ గత 20 ఏళ్లుగా నిరంతరం ప్రజా సేవలో కొనసాగుతున్నారు. ఆయన చేసిన కొన్ని ప్రధాన సేవా కార్యక్రమాలు:
వైద్య సేవలు: ఏడాదికి రెండుసార్లు ఉచిత మెగా వైద్య శిబిరాల నిర్వహణ.
కరోనా కష్టకాలంలో:
3000 మందికి పైగా మామిడికాయ పచ్చడి పంపిణీ, ప్రైవేటు టీచర్లు మరియు పేదలకు బియ్యం, నిత్యవసర సరుకుల అందజేత.
వరద బాధితులకు అండగా: వరదల సమయంలో బాధితులకు ఆహారం, నీరు, బట్టలు మరియు నిత్యవసర వస్తువుల పంపిణీ.
విద్యార్థులకు సహాయం: నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక చేయూత.
కులం, మతం అనే తేడా లేకుండా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు మరియు యువతకు నిత్యం అండగా నిలుస్తున్న పల్లా కిరణ్ సేవలను స్థానికులు మరియు ఆశ్రమ నిర్వాహకులు కొనియాడుతున్నారు. "నా అంటూ ఎవరూ లేని సమయంలో కొడుకులా ఆదుకుని నాకు చూపునిచ్చిన కిరణ్ బాబుకు రుణపడి ఉంటాను" అని వృద్ధురాలు కృష్ణకుమారి కన్నీటి పర్యంతమయ్యారు.


Comments