రంగాపూర్లో ఘనంగా పోచమ్మ బోనాలు
భక్తులతో కళకళలాడిన గ్రామం
హుజురాబాద్ రూరల్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో బుధవారం పోచమ్మ బోనాలు ఉత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. శ్రీ మడెలేశ్వర రజక యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో కళకళలాడింది.
మహిళలు సంప్రదాయ దుస్తులతో బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివశత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కులు చెల్లిస్తూ అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం ఆలయం వద్ద సంప్రదాయం ప్రకారం గొర్రెపోతులను బలి ఇచ్చి పూజలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో డప్పుల మోగింపు, భక్తి గీతాలు, యువత నృత్యాలతో ఉత్సవం మరింత ఉత్సాహంగా సాగింది. గ్రామ పెద్దలు, యువత కలిసి ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ కుంట అరుణ, ఉపసర్పంచ్ బండి నరేష్ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే గ్రామ ప్రముఖులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై పోచమ్మ బోనాల ఉత్సవాన్ని ఘనంగా జరిపారు.


Comments