తాళం పగులగొట్టి దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్
కీసర, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఆరుమళ్ల వెంకట్ రెడ్డి ఈ నెల 16న ఉదయం సుమారు 9 గంటలకు తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు.అనంతరం మధ్యాహ్నం 12:05 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టబడినట్లు గుర్తించారు.ఈ ఘటనలో కీసర ప్రాంతానికి చెందిన బాల నేరస్థుడు దర్యాగుల జగదీష్ అలియాస్ సంతోష్ అలియాస్ సంతు ఇంట్లోకి చొరబడి, అల్మిరాలోని బంగారు ఉంగరాలు, చిన్న గొలుసు, చెవి దిద్దులు (మాటీలు) మరియు రియల్మీ మొబైల్ ఫోన్ను దొంగిలించినట్లు తేలింది.పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి, మార్చ్ 18న బుధవారం రోజు నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన వస్తువులను రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కీసర పోలీసులు ప్రజలకు సూచించారు.


Comments