రైతుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు వినతి
ఎల్కతుర్తి, మార్చ్ 18. (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ఈరోజు రైతు సంఘం నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రైతులు సమర్పించిన వినతిపత్రంలో ముఖ్యంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని, రూ.2 లక్షల పైబడిన పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని పేర్కొన్నారు. అలాగే మొక్కజొన్న పంటను మద్దతు ధర ప్రకారం మార్క్ఫెడ్ ద్వారా క్వింటాల్కు రూ.2400 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, గాలి, వాన, తుఫాన్ల వల్ల నష్టపోయిన పంటలకు తక్షణ పరిహారం అందించాలని రైతులు కోరారు. సాదా బైనామా ద్వారా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలని, వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందించాలన్నారు.
ఇక సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, యూరియా యాప్పై రైతులకు సరైన అవగాహన కల్పించాలని సూచించారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని రైతు నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెట్టెం నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి రాములు, సీనియర్ నాయకులు మోతే లింగారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ రావు, జిల్లా నాయకులు పొన్నగంటి అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.


Comments