కల్లూరుగూడెం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన.!
- రూ.100 కోట్లతో నిర్మాణం.
- 60 శాతం పనులు పూర్తి.
సత్తుపల్లి, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం కల్లూరుగూడెం వద్ద నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ బుధవారం పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మలేషియా ఆధునిక సాంకేతికతతో ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ప్రారంభమైతే వేంసూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు ఆయిల్ పామ్ పంటల ద్వారా స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ స్థాపనతో కల్లూరుగూడెం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగాయని, రైతుల్లో ఆర్థిక ఆశలు పెరిగాయని చెప్పారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించడంతో పాటు రోజువారీ కూలీ పనులు కూడా లభిస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, కాలుష్యం లేకుండా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్వహణ జరగేలా అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పరిశ్రమ అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ రెండూ సమానంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక త్వరలో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా వేంసూరు మండలానికి సాగునీరు అందుతుందని, దీంతో పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు కలిసివస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు సోమిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గొర్ల సంజీవరెడ్డి, నాయకులు వెల్ది జగన్ మోహన్ రావు, గంగాధర్ రావు, కుక్కపల్లి శ్రీను, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అధికారులు, గ్రామ సర్పంచులు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments