గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి
గిరిజన సంఘం రాష్ట్ర నాయకుల డిమాండ్
హన్మకొండ,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా లో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు వి వీరన్న నాయక్, ప్రధాన కార్యదర్శి పి శ్రీకాంత్ మాట్లాడుతూ రాబోయే 2026-27 బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి కనీసం 25 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దళితులు, గిరిజనుల ఓట్లు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులకు పలు హామీలు ఇచ్చి, వాటిని గ్యారెంటీగా ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు. గత రెండేళ్లలో గిరిజనులకు కేటాయించిన నిధుల్లో పెద్ద భాగం ఖర్చు చేయకుండా మిగిల్చారని ఆరోపించారు.
అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షల రూపాయలు అందించాలంటే సుమారు 12 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. సమ్మక్క సారక్క గ్రామీణ అభివృద్ధి పథకం ద్వారా గిరిజన గ్రామపంచాయతీలకు ప్రతి ఏడాది ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఇందుకు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని పేర్కొన్నారు. గిరిజన కార్పొరేషన్ల ఏర్పాటు, ఐటీడీఏల విస్తరణ, విద్యాజ్యోతి పథకం అమలు వంటి కార్యక్రమాలకు కూడా భారీ స్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉంటుందని వివరించారు.
అసైన్డ్ భూముల రక్షణ, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బడ్జెట్ ప్రవేశపెడితే తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బానోత్ జగన్, భూక్య తిరుపతి, భూక్య స్వరూప, రాయపూరి సారయ్య, భూక్య సిద్దు, భూక్య లాలు, అంగడి ప్రభాకర్, ధరావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments