కాప్రా డీసికి మొరపెట్టుకున్నా స్పందన లేదని ప్రజలు ఆవేదన
_యంత్రాలు, సిబ్బంది కొరతతో నిలిచిన దోమల నివారణ చర్యలు
_డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించిన కాలనీవాసులు
_ఫాగింగ్, పారిశుధ్య చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్
కాప్రా, మార్చి 19 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోనల్ కమిషనర్ కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ, చర్లపల్లి డివిజన్లలో దోమల బెడద తీవ్రంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాలనీవాసులు కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించారు.గతంలో ఫాగింగ్ యంత్రాల ద్వారా ప్రతి వీధిలో దోమల నివారణ చర్యలు చేపట్టడంతో సమస్య కొంతవరకు నియంత్రణలో ఉండేదని ప్రజలు తెలిపారు.అయితే ఇటీవల కాలంలో ఫాగింగ్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో దోమల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన లభించలేదని ఆరోపించారు.కాప్రా సర్కిల్ అధికారులను ప్రశ్నిస్తే దోమల నివారణకు సరిపడ యంత్రాలు లేవని, కార్మికులు కొరత ఉందని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.దోమల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు జ్వరాలు, వైరల్ వ్యాధులతో బాధపడుతున్నారని, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. కుషాయిగూడ డివిజన్ పరిధిలో వెంటనే ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ను కోరారు.అదేవిధంగా కాలువలు, చెత్త నిల్వలు, నిల్వ నీటి ప్రాంతాలను శుభ్రపరిచి దోమల పెరుగుదలను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Comments