దోమల నివారణపై డీసీ స్పందన… కాప్రా ప్రజల్లో హర్షం
_తెలంగాణ ముచ్చట్లు” కథనానికి అధికారుల స్పందన
_వినతిపత్రం ఫలితం
– ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలకు శ్రీకారం
కాప్రా, మార్చి 20 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలో దోమల సమస్యపై ప్రజల వినతికి డిప్యూటీ కమిషనర్ శ్రీహరి స్పందించడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.కుషాయిగూడ, చర్లపల్లి డివిజన్లలో పెరిగిన దోమల బెడదపై ఇటీవల వచ్చిన తెలంగాణ ముచ్చట్లు వార్తలతో పాటు ప్రజల వినతిపత్రానికి స్పందిస్తూ అధికారులు చర్యలు ప్రారంభించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాలనీవాసులు డీసీకి వినతిపత్రం సమర్పించి, ఫాగింగ్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో దోమల సంఖ్య పెరిగిందని వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై స్పందించిన డీసీ శ్రీహరి, దోమల నివారణకు ఫాగింగ్ కార్యక్రమాలను పునరుద్ధరించడంతో పాటు పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.అవసరమైన సిబ్బంది, పరికరాలు సమకూర్చి ప్రతి ప్రాంతంలో చర్యలు చేపట్టాలని సూచించారు.దోమల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు జ్వరాలు, వైరల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. ముఖ్యంగా కుషాయిగూడ డివిజన్లో ప్రత్యేక ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు హామీ ఇచ్చారు.అదేవిధంగా కాలువలు, చెత్త నిల్వలు, నిల్వ నీటి ప్రాంతాలను శుభ్రపరిచి దోమల పెరుగుదలను అరికట్టేందుకు మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు.కుషాయిగూడ డివిజన్ పరిధిలో లక్ష్మీ నరసింహ కాలనీ, మీనాక్షి నగర్ కాలనీ, మధురా నగర్ కాలనీ, గాంధీ నగర్ కాలనీలలో యాంటీ లార్వా ఆపరేషన్తో పాటు ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈ రవి, కుషాయిగూడ వాడు ఎంటమాలజీ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన చర్యలపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Comments