భక్తి ఉత్సాహంతో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జరపాలి
హుజురాబాద్, మార్చి 22: (తెలంగాణ ముచ్చట్లు)
శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలను భక్తి ఉత్సాహాలతో ఘనంగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ హుజురాబాద్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజురాబాద్ మండలం కనుకుల గిద్ద గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని, నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను వైభవంగా జరపాలని సూచించారు. ప్రతి ఇంటిపై కాషాయ పతాకాలు ఎగరవేయాలని, దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కోరారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ముందుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానాలు, భజన మండళ్లు, హరికథలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.
గ్రామాల్లో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే ఈ మహోత్సవాల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


Comments