బేతుపల్లిలో సీతారాముల కల్యాణం ఘనంగా.!
- శ్రీరామనవమి వేడుకల్లో భక్తుల సందడి.
- అన్నదానం, పానక కైంకర్యాలతో సేవా కార్యక్రమాలు.
సత్తుపల్లి, మార్చి 27(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం, బేతుపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయం పండుగ వాతావరణంలో కళకళలాడగా, భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారి దర్శనం పొందారు. అర్చకులు ప్రతాపరపు శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, సంతోష్ అయ్యగార్లు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు సీతారాముల కల్యాణ మహిమను వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు. కల్యాణోత్సవాన్ని కాలసాని గజేంద్రరావు–సుజాత దంపతులు, వారి కుమారుడు మధు–లక్ష్మీ దంపతులు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. సీపీ సూర్యనారాయణ–వాణి దంపతులు పానక కైంకర్యాన్ని చేపట్టి సేవలందించారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామి వారి ఆశీస్సులు పొందారు.


Comments