రాధిక ఎక్స్ రోడ్డులో దాడి
_పార్కింగ్ వివాదం ముదిరి వ్యాపారిపై దాడి
– ఇద్దరిపై కేసు నమోదు
కుషాయిగూడ, మార్చి 30 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో కుషాయిగూడ ప్రాంతంలోని రాధిక ఎక్స్ రోడ్డులో పార్కింగ్ వివాదం దాడికి దారితీసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఫిర్యాదుదారు మామిడి విగ్నేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆయన తండ్రి మామిడి సంతోష్ గౌడ్ (44), వ్యాపారి, మార్చి 30న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని రాధిక ఎక్స్ రోడ్డులోని ఒక షాపు ముందు పార్క్ చేస్తుండగా ఘటన జరిగింది.
అక్కడ ఇప్పటికే ఉన్న మరో టూ వీలర్ను ఇద్దరు వ్యక్తులు తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, “పక్కన నుంచి వెళ్లవచ్చుగా” అని సంతోష్ గౌడ్ చెప్పడంతో మాటల తగాదా చెలరేగింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు దుర్భాషలాడుతూ సంతోష్ గౌడ్పై పిడిగుద్దులు కురిపించి, రాయితో ముక్కుపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.గాయపడిన సంతోష్ గౌడ్ను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఘటనలో పాల్గొన్న రాహుల్ జైస్వాల్, పార్థ్ కుమార్ చౌదరి అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Comments