సైబర్ మోసగాళ్లపై పోలీసుల ఉక్కుపాదం
– కాల్ సెంటర్ గుట్టురట్టు
_వాట్సాప్ ట్రేడింగ్ మోసం బట్టబయలు
– బాధితుడి నుంచి లక్షలు దోచుకున్న గ్యాంగ్ అరెస్ట్
_రూ.36 లక్షల మోసం కేసులో 8 మంది అరెస్ట్
– భారీ ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
మల్కాజిగిరి, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించి, నకిలీ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాల్ సెంటర్ గుట్టును రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి క్రైమ్ నంబర్ 185/2026 కింద కేసు నమోదు చేసి, మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.నాగోల్కు చెందిన అధ్యాపకుడు గుర్రం నవీన్ చందర్ (35) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులు “బార్క్లేస్” పేరుతో వాట్సాప్ గ్రూప్ సృష్టించి, ట్రేడింగ్లో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లో సుమారు రూ.7 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి బాధితుడి విశ్వాసాన్ని పొందారు. దీంతో బాధితుడు విడతల వారీగా రూ.36,35,010 పెట్టుబడి పెట్టాడు. చివరకు కేవలం రూ.5,000 మాత్రమే తిరిగి రావడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.ఇన్స్పెక్టర్ జి. సుధాకర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుల ఆచూకీని గుర్తించి, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమీరం గ్రామంలో మార్చి 31న వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 45 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 3 రౌటర్లు, 2 ట్యాబ్లు, 22 చెక్ బుక్కులు, 40 ఏటీఎం కార్డులు, 20 సిమ్ కార్డులు, అలాగే పలు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, ఐపీఎస్ పర్యవేక్షణలో, డిసిపి సైబర్ క్రైమ్స్ ఎస్.వి. నాగ లక్ష్మి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో విజయవంతంగా ఛేదించారు.
*ప్రజలకు హెచ్చరిక:*
సోషల్ మీడియాలో వచ్చే తక్కువ సమయంలో భారీ లాభాలు ఇస్తామనే ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థల విశ్వసనీయతను ఖచ్చితంగా నిర్ధారించుకోవాలని, అపరిచితులకు డబ్బులు పంపడంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.


Comments